: ఆ కేసులో కొత్త ట్విస్టు...స్వామీజీ తండ్రి లాంటి వాడు రేప్ చేయలేదన్న యువతి

దేశంలోనే అత్యంత సంచలనం సృష్టించిన కేరళ స్వామీజీ అత్యాచార యత్నం కేసులో ఊహించని ట్విస్టు వచ్చింది. ఎర్నాకులం జిల్లా కొల్లాంలోని పద్మనాభ చట్టంబి స్వామి ఆశ్రమానికి చెందిన గంగేశానంద తీర్థపాద ఓ యువతిపై కన్నేసి ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆ యువతి పదునైన కత్తితో అతడి రహస్యాంగాన్ని కోసివేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించడంతో స్వామి కోలుకున్నాడు. తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని, ప్రతిఘటించినా వినకపోవడంతో తాను ఆపని చేయక తప్పలేదని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో పేర్కొంది. దీంతో స్వామీజీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, దేశవ్యాప్తంగా బాధితురాలిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె మంచి పని చేసిందని, అత్యంత ధైర్యసాహసాలతో వ్యవహరించిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా అభినందించారు.

ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పుడామె మాట మార్చింది. కోర్టుకు ఇచ్చిన టెలిఫోన్ వాంగ్మూలంలో స్వామి గంగేశానంద తీర్థపాద తనకు తండ్రి లాంటి వాడని, తనపై అత్యాచారయత్నం చేయలేదని తెలిపింది. తాను స్వామిజీ మర్మాంగాన్ని కోయలేదని....పోలీసులే స్వామిజీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తనపై  ఒత్తిడి తెచ్చారని షాకిచ్చింది. అంతే కాకుండా తనకు అయ్యప్పదాస్ అనే వ్యక్తితో సంబంధం ఉందని, ఆయనతో స్వామీజీకి ఆర్థిక వివాదాలున్నాయని తెలిపింది. దీంతో ఈ కేసులో తీర్పుగురించి ఆసక్తి వ్యక్తం చేసినవారంతా షాక్ తిన్నారు. అయితే బాధిత యువతి తల్లిదండ్రులను స్వామిజీ మనుషులు ఆధీనంలో పెట్టుకొని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా ఆమెతో ఇలా మాట్లాడించారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం స్వామి గంగేశానంద తీర్థపాద మాట్లాడుతూ, తన రహస్యాంగాన్ని తానే కోసుకున్నానని చెప్పారు. అలా ఎందుకు కోసేసుకున్నారు? అంటే దానితో పని లేదని కోసేశానని చెప్పారు. దీనిని పోలీసులు రికార్డు చేశారు. 

More Telugu News