: పదవీ కాలం ముగుస్తున్న వేళ.. రెండు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ప్రణబ్

పదవీకాలం ముగియనున్న వేళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. దీంతో ఐదేళ్ల కాలంలో ఆయన తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్ల సంఖ్య 30కి చేరుకుంది. తాజా పిటిషన్లను మే చివరి వారంలో తిరస్కరించినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

2012లో నాలుగేళ్ల ఇండోర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. ఇంకో కేసులో పుణెలో ఓ టెక్కీపై క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ రెండు కేసుల్లోను దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులకు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లు ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రపతికి చేరాయి. వాటిని పరిశీలించిన ప్రణబ్ తిరస్కరించారు.

కాగా, గతంలో.. 26/11 ముంబై దాడిలో దోషిగా తేలిన అజ్మల్ కసబ్, పార్లమెంట్ దాడి కేసులో  అఫ్జల్ గురు, ముంబై పేలుళ్ల అపరాధి యాకూబ్ మెమెన్ తదితరులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. అయితే, ప్రణబ్‌కు ముందు రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా పాటిల్ మాత్రం ఒక్క క్షమాభిక్ష పిటిషన్‌పైనా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

More Telugu News