: ‘దోపిడి బాబు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రఘువీరారెడ్డి

‘దోపిడి బాబు’ పేరిట రూపొందించిన ఓ పుస్తకాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. టీడీపీ, బీజేపీ మూడేళ్ళ పాలనపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మూడేళ్ల పాలన అవినీతిమయమని, ఓ ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడటం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆరోపించారు. సీఎం సహా ఆ పార్టీలో ఉన్న వారందరూ ఆర్థిక నేరస్థులేనని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘దోపిడి బాబు’ పేరిట విడుదల చేసిన ఈ పుస్తకం ద్వారా ప్రజలకు అన్ని విషయాలు వివరించడానికి తాము సిద్ధమేనని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని రఘువీరా సవాల్ విసిరారు. రాష్ట్రంలో రూ.34 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను రూ.76 వేల కోట్లకు పెంచి కేబినెట్ నిర్ణయంతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, టీడీపీ మంత్రులే భూదందాలకు పాల్పడి రోడ్లపైనే కొట్టుకుంటున్నారని  ఆరోపించారు. ఎన్నికలకు ముందు పలు కులాలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, టీడీపీ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఎవరిని మభ్యపెట్టేందుకని రఘువీరా ప్రశ్నించారు.

More Telugu News