: పాక్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదు: కోహ్లీ

ఫైనల్ లో పాకిస్థాన్ తో ఎలా ఆడాలో తమకు తెలుసని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. బంగ్లాదేశ్ పై విజయం సాధించిన అనంతరం మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ, పాక్ జట్టును తాము తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నాడు. లీగ్ దశలో తొలి ఓటమి తరువాత పాకిస్థాన్ అద్భుతంగా పుంజుకుందని చెప్పాడు. ఓటమి అనంతరం వారి ఆటతీరులో అనూహ్యమైన మార్పు వచ్చిందని, ఎంతో శ్రమించి బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించారని కోహ్లీ తెలిపాడు.

అందుకే, లీగ్ దశలో పాక్ పై విజయం సాధించామని తేలిగ్గా తీసుకుంటే బొక్కబోర్లా పడాల్సి ఉంటుందన్న సంగతి తనకు తెలుసని అన్నాడు. ఫైనల్ అనగానే ఏ జట్టైనా ఒత్తిడి ఎదుర్కొంటుందని అన్నాడు. అయితే తాము మాత్రం ఫైనల్ ను కూడా తరువాతి మ్యాచ్ గా భావించి బరిలోకి దిగుతామని కోహ్లీ చెప్పాడు. తమకు పాక్ బలంతో పాటు బలహీనత కూడా తెలుసని చెప్పాడు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఫైనల్‌ కు సన్నద్ధమవుతామని కోహ్లీ చెప్పాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయాలని కోరుకోవడం లేదని కోహ్లీ చెప్పాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరిన పాక్ టైటిల్ సాధించాలని తీవ్రమైన సాధనలో మునిగిపోయింది.

More Telugu News