: కుకునూరు ఎస్సై ఎవరో నాకు తెలియదు.. గంటకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది: శిరీష భర్త ఆవేదన

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరులో ఎస్సై ప్ర‌భాక‌ర్ రెడ్డి తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్‌ శిరీషకు, ప్ర‌భాక‌ర్ ఘటనకు సంబంధం ఉందంటూ పోలీసులు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై శిరీష భ‌ర్త సతీశ్‌ చంద్ర స్పందించారు. తన భార్య మృతిపై గంటకో విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంద‌ని ఆవేద‌న చెందారు. దీంతో ఈ విష‌యం గురించి తనకేమీ అర్థం కావడంలేదని అన్నారు.

మొన్న రాత్రి తాను త‌న భార్య‌తో ఫోన్‌లో మాట్లాడాన‌ని అన్నారు. త‌న భార్య మృతిపై విచారణ చేయాలని తాను పోలీసులను కోరాన‌ని చెప్పారు. మొన్న రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తానని త‌న భార్య ఫోన్‌ చేసి చెప్పిందని అన్నారు. పోలీసులు చెబుతున్న కుకునూరు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఎవరో తనకు అస‌లు తెలియదని అన్నారు. తాను ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు.  త‌న  భార్య ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాద‌ని అన్నారు.

More Telugu News