: బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం.. పోలీస్ట్ స్టేషన్ లో ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో కొత్త కోణం!

త‌న స‌ర్వీసు తుపాకీతో కాల్చుకొని సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరులో ఎస్సై ప్ర‌భాక‌ర్ రెడ్డి పోలీస్ స్టేష‌న్‌లోనే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో మ‌రో ట్విస్ట్ ఎదురైంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో నిన్న అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్‌ శిరీషకు, ఈరోజు ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న ప్ర‌భాక‌ర్‌ కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్ర‌భాక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో విచార‌ణ ప్రారంభించిన‌ పోలీసులకు గత కొంతకాలంగా ప్రభాకర్ రెడ్డికి శిరీషతో పరిచయం ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు మద్యం మత్తులో శిరీషపై ప్రభాకర్‌ రెడ్డి అత్యాచారం చేసినట్లు కూడా ఆరోపణలు వ‌స్తున్నాయి. ఈ రోజు ఉదయం శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఈ కేసు త‌న మెడ‌కు చుట్టుకుంటుంద‌న్న భ‌యంతోనే ఎస్‌ఐ కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే, శ్రీకృష్ణానగర్‌లో ఉండే శిరీష(28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది. నిన్న‌ ఉదయం ఆమె తన  ఆఫీసులో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె భ‌ర్త సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదు చేయ‌డంతో శిరీష స్నేహితుడు, ఆర్‌జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని అయిన రాజీవ్‌, అతని స్నేహితుడు శ్రావణ్‌ల‌ను అరెస్టు చేశారు. వారిద్ద‌రితో శిరీష‌కు వివాదాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. వారి మధ్య నిన్న‌ తెల్లవారుజామున రెండున్నర వరకూ గొడ‌వ జ‌రిగింద‌ని తెలుసుకున్నారు.

 రాజీవ్‌ను ప్రశ్నించగా మొద‌ట‌ శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని చెప్పాడు. పోలీసులు ఆయ‌న‌ను రెండోసారి విచారించగా బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పోలీసులకు అత‌డిపై ఉన్న‌ అనుమానాలు బలపడ్డాయి. రాజీవ్‌తో పాటు అతడి స్నేహితుడిని ప్ర‌శ్నించ‌గా ఎస్ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే, సిద్ధిపేట‌లో విధులు నిర్వ‌ర్తిస్తోన్న ప్ర‌భాక‌ర్ రెడ్డికి హైద‌రాబాద్‌లో ఉండే శిరీష‌కు మ‌ధ్య ఎప్ప‌టి నుంచి ప‌రిచయం ఉంది? అనే విష‌యం తెలియాల్సి ఉంది.

More Telugu News