: భూమా ఉన్నంత వరకూ ఎంతో బాగుండేదంటూ, తప్పంతా అఖిల ప్రియదేనన్న శిల్పా మోహన్ రెడ్డి

భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నంద్యాల అభివృద్ధి పథంలోనే నడిచిందని, అఖిల ప్రియ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పరిస్థితి మరింతగా దిగజారిందని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ పరంగా తనకు, భూమాకు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఎన్నో సమస్యల విషయమై, నంద్యాల ప్రజల కోసం తామిద్దరమూ చర్చలు జరిపే వారమని చెప్పారు.

అయితే, అఖిల ప్రియ ఎన్నడూ ప్రజల సమస్యలపై దృష్టిని పెట్టలేదని అన్నారు. ఆమెకు నియోజకవర్గంపై అవగాహన లేదని, తల్లి మరణంతో వచ్చిన సానుభూతితోనే విజయం సాధించారని అన్నారు. కార్యకర్తలను, ప్రజల బాగోగులను ఆమె మరచిపోయిందని ఆరోపించారు. భూమా చనిపోయిన తరువాత, అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే వేళ తాను అభ్యంతరం పెట్టలేదని చెప్పుకొచ్చిన శిల్పా, ఆనాడే చంద్రబాబుకు టికెట్ తనకు కావాలని స్పష్టంగా చెప్పానని అన్నారు. తాను అతి తక్కువ మెజారిటీతోనే ఓడిపోయానని చెప్పిన ఆయన, తన టికెట్ ను తనకు ఇవ్వకపోవడం బాధను కలిగించిందని తెలిపారు. చంద్రబాబు నిర్లక్ష్యం, ఎక్కడికి పోతారులే అన్న అలసత్వ ధోరణి కారణంగానే పార్టీని వీడినట్టు పేర్కొన్నారు.

More Telugu News