: అత్యాచారం తీరును బొమ్మలేసి కోర్టుకు చూపిన బాలిక.. నిందితుడికి ఐదేళ్ల జైలు!

నీడనిచ్చానన్న ధీమాతో ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి సాక్ష్యాధారాలు లేవని సంబరపడుతున్న వేళ ఆయన ఆనందం ఆవిరైంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు కట్టినట్టు కోర్టుకు చూపించింది. దీంతో నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళ్తే..

కోల్‌కతాకు చెందని ఓ బాలిక (10) ఢిల్లీలోని తన మామయ్య అక్తర్ అహ్మద్ ఇంటిలో ఉండి చదువుకుంటోంది. రెండేళ్ల క్రితం అంటే.. బాలిక 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అక్తర్ ఆ చిన్నారిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతేడాది జూన్‌లో అక్తర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక కావాలనే నిందితుడిని వేధిస్తోందని, అత్యాచారం జరిగిందనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని నిందితుడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బాలిక ఆరోపణలను పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. అయితే సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరిగింది.

విచారణలో భాగంగా కోర్టులో బాలికకు ఓ పేపర్, క్రేయాన్లు ఇచ్చి  ఏం జరిగిందో బొమ్మ గీసి చూపించమనగా, బాలిక తనపై జరిగిన అత్యాచారం తీరును కళ్లకు కట్టినట్టు బొమ్మ గీసి చూపించింది. ఓ ఇంట్లో చేతిలో బెలూన్లు పట్టుకుని నిల్చున్న బాలిక తన దుస్తులు దూరంగా పడి ఉన్నట్టు బొమ్మ వేసింది. అంతేకాక తన ఆవేదనకు అద్దంపట్టేలా దిగులును ప్రతిబింబించే రంగులు వాడింది. ఆమె బొమ్మను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఏం జరిగిందో అర్థం చేసుకుంది. బాలిక గీసిన బొమ్మను బలమైన సాక్ష్యాధారంగా పరిగణించిన ఢిల్లీ కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

More Telugu News