: సినారెకి ప్రకృతిపై ఎంతో ప్రేమ.. తన కూతుళ్లందరికీ నదుల పేర్లే పెట్టుకున్నారు: చంద్రబాబు
అనారోగ్యంతో కన్నుమూసిన రచయిత సినారెకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని సినారె నివాసానికి వచ్చిన చంద్రబాబు.. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి, సంతాపం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్కి నారాయణ రెడ్డి అంటే ఎంతో ఇష్టమని అన్నారు. సినారెను ఎన్టీఆర్ ఓ సొంత కుటుంబ సభ్యుడిలా చూసేవారని అన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో సినారె బ్రహ్మాండమైన పాటలు రాశారని వ్యాఖ్యానించారు. సినారె మొత్తం 3,500 పాటలు రాశారని అన్నారు. ఆయన రచనలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన తన కూతుళ్ల పేర్లను గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పెట్టుకున్నారని, దీన్ని బట్టి ఆయనకు నదులపై, ప్రకృతిపై ఎలాంటి ప్రేమ ఉందో తెలుస్తోందని అన్నారు.