: ప్రియుడితో కలసి అదృశ్యమైన కారంపూడి యువతి... పట్టిచ్చిన ఫేస్ బుక్!

ఇంటర్ పరీక్షలు రాసిన ఓ యువతి మార్చి 14వ తేదీన తన ప్రియుడితో కలసి అదృశ్యంకాగా, ఆ అమ్మాయిని ఫేస్ బుక్ పట్టించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా గురజాలలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం...
కారంపూడికి చెందిన యువతి గురజాలలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. పరీక్షలు రాసిన తరువాత ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

దీనిని విచారించిన పోలీసులు దాచేపల్లి మండలం కేశానుపల్లికి చెందిన వినుకొండ రవీంద్ర అనే యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు ఫేస్ బుక్ ద్వారా కనిపెట్టారు. అతని ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టగా, అతను హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తున్నట్టు తేలింది. దీంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం మాల్ వద్ద వివరాలు సేకరించి, రెండు రోజుల అనంతరం అతని ఇంటి చిరునామాను గుర్తించారు. ఈ జంటను గురజాలకు తీసుకువచ్చారు. యువతి మేజర్ కావడంతో, ఆమె ఇష్టప్రకారం ఎవరి వద్దకు వెళ్లాలనుకుంటే, అక్కడికి పంపుతామని, అంతకన్నా ముందు తల్లికి అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News