: టీవీ చర్చా కార్యక్రమంలో నోరు పారేసుకున్న వ్యక్తికి దీటైన సమాధానం ఇచ్చిన యాంకర్!
బాలీవుడ్ భామలు వేసుకున్న డ్రెస్లు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశంపై చర్చ చేపడితే రేటింగ్స్ అదిరిపోతాయని భావించిన పలు జాతీయ ఛానెళ్లు.. ‘అసలు ఎందుకు ఇటువంటి డ్రెస్సు వేసుకుంటున్నారు? ఇది రైటా? రాంగా? మీ అభిప్రాయం చెప్పండి’ అంటూ చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే ఓ యాంకర్పై చర్చలో పాల్గొంటున్న ఓ వ్యక్తి నోరు పారేసుకున్నాడు. దీంతో ఆ యాంకర్ కూడా అతడికి గట్టిగా జవాబు ఇచ్చింది. ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్ మిర్రర్ నౌ నిర్వహిస్తోన్న ఓ చర్చా కార్యక్రమంలో దంగల్ సినిమాలో నటించిన ఫాతిమా సనా షేక్ స్విమ్ షూట్ గురించి, దేశ ప్రధాని మోదీని కలిసినప్పుడు ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ గురించి చర్చిస్తున్నారు. ఈ షోలో యాంకర్ గా ఫయె డిసౌజా అనే యువతి ఉంది.
ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అందులో పాల్గొన్న ముస్లిం వక్త మౌలానా యాసూబ్ అబ్బాస్ మాట్లాడుతూ ఆ యాంకర్ పై మండిపడ్డారు. తాము కూడా ఆడవారితో సమానత్వం అంటూ అండర్ వెయిర్ వేసుకొని ఈ డిబేట్ కు వస్తే ఎలా ఉంటుందని అన్నారు. వర్క్ ప్లేస్ లో అండర్ వేర్ చూపిస్తే పురుషులకు, మహిళలకు ఇద్దరికీ సమానత్వం ఉంటుందని అన్నాడు. దీంతో ఆ న్యూస్ రీడర్ షాక్ తింది. వెంటనే సమాధానం ఇస్తూ ఆడవాళ్లను తమ జాబ్ చేసుకోనివ్వకుండా మగవారు బెదిరిస్తే, ఆడవారంతా వంటింటికే పరిమితం అవుతారని చెప్పింది. ఆడవారు బయటకు రాకపోతే బయట అంతా ఇక మగాళ్లే కనిపిస్తారని, అప్పుడు మగవాళ్లే ప్రపంచాన్ని జయించాలని పలు వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యక్తి తనను అన్న మాటలకు తాను ఏ మాత్రం భయపడబోనని, ఆయన లాంటి వాళ్లను తాను చాలా మందిని చూశానని సమాధానం ఇచ్చింది.