: జగన్ ను హత్య చేయాల్సిన అవసరం మాకు లేదు... అది వైకాపా కుట్రే!: టీడీపీ నేత లింగారెడ్డి అనుమానం

వైకాపా అధినేత వైఎస్ జగన్ ను హత్య చేయాల్సిన అవసరం తమకు లేదని టీడీపీ నేత, ఏపీ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ ఎం లింగారెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిలోని జగన్ చాంబర్ లో నీళ్లను లీక్ చేసి, ఆపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ను కల్పించి హత్య చేయాలన్న కుట్ర పన్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించిన నేపథ్యంలో, లింగారెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు వైకాపా స్వయంగా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తూ, అటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని అన్నారు.

ఓ అసమర్థ నేత విపక్షంలో ఉండగా, తమకెంతో లాభం కలుగుతోందని, ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకు వైకాపా నేతలే కుట్రలు చేసి వుంటారన్న అనుమానం తమకుందని అన్నారు. తండ్రి మరణించగానే పదవి కోసం శవ రాజకీయాలు చేసిన ఘనత ఆయనదేనని దుయ్యబట్టారు. వైకాపా నేతలు ఉద్యోగులను బెదిరిస్తున్నారని, గనులు దక్కలేదన్న అక్కసుతోనే చెవిరెడ్డి చౌకబారు ఆరోపణలకు దిగుతున్నారని ఆరోపించిన లింగారెడ్డి, అధికారులను భయపెట్టే సంస్కృతి వైకాపాదేనని విమర్శించారు.

More Telugu News