: ఆ గొప్పతరం అంతరిస్తోంది: భావోద్వేగంతో హరికృష్ణ

తెలుగు సినీ వినీలాకాశంలో మెరుపులు మెరిపించిన నాటి గొప్పతరంలోని ఒక్కొక్కరూ దూరమవుతూ ఉండటం మనసుకెంతో బాధను కలిగిస్తోందని నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సినారే భౌతికకాయం వద్ద నివాళులు అర్పించిన ఆయన, భావోద్వేగం నిండిన కళ్లతో మీడియాతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో ఎందరో సినీ ప్రముఖులు వెళ్లిపోయారని అన్నారు.

 దుర్యోధనుడికి, భీముడికి కూడా పాటలు రాసిన ఘనత సినారేదేనని కొనియాడుతూ, తనకు, ఆయనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను నటించిన 'సీతయ్య' సినిమాలో 'ఇదిగో రాయలసీమ గడ్డ...' అంటూ అద్భుతమైన పాటను అందించారని తెలిపారు. సినారే మృతి తెలుగు భాషకు తీరని లోటని, ఈ సందర్భంలో చెప్పే విషయం కాకున్నా, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు హరికృష్ణ పేర్కొన్నారు.

More Telugu News