: ఎయిరిండియా ప్రయాణికులకు షాక్.. సూప్‌కు సెలవు.. పుస్తకాలకు నెలవు!

అప్పుల ఊబిలోంచి బయటపడేందుకు ఎయిరిండియా కఠిన నిర్ణయాల దిశగా ముందుకెళ్తోంది. ఇక నుంచి అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు అందించే భోజనాల్లో సూప్‌కు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. అలాగే, కొన్ని మ్యాగజైన్లను అందుబాటులోకి తేనుంది.  

రూ.52 వేల కోట్ల అప్పల్లో కూరుకుపోయిన ఎయిరిండియా అందులో నుంచి బయటపడేందుకు నానాపాట్లు పడుతోంది. అందులో భాగంగానే ఇటువంటి నిర్ణయాల దిశగా ఆలోచిస్తోంది. కేబిన్ క్రూ ఇన్‌చార్జ్ ఒకరు ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం ఇటువంటి మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్‌లో 20 శాతం సలాడ్ ఉంటోంది. దీనిని పూర్తిగా తీసేసి ఎయిరిండియాకు చెందిన శుభయాత్ర మ్యాగజైన్‌ కాపీలను 25 పెడితే సరిపోతుందని ఆయన సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కాక్‌పిట్ డోర్ కర్టెన్‌ను కూడా తొలగించాలని సూచించినట్టు సమాచారం. ఇటువంటి చిన్నచిన్న పనుల వల్ల విమానం బరువు తగ్గుతుందని, ఫలితంగా ప్రయాణానికి అయ్యే ఆయిల్ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని సూచించినట్టు తెలుస్తోంది.

ఇటువంటి చర్యలు చాలా చిన్నవని, సముద్రంలో నీటి బొట్టు లాంటివని మరికొందరు సిబ్బంది చెబుతున్నారు. అయితే 1980లలో అమెరికా విమానయాన సంస్థ ఒకటి భోజనంలో ఆలివ్ ఆయిల్‌ను తొలగించడం వల్ల ఏడాదికి లక్ష డాలర్లను ఆదా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరికొందరు గుర్తు చేస్తున్నారు.

More Telugu News