: మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఆడియో ఫంక్షన్ నిర్వహించి.. సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?: అల్లు అర్జున్ సినిమాటిక్ డైలాగు

'పబ్బుల్లో వాయించే డీజే కాదు...పగిలిపోయేలా వాయించేవాడీ డీజే' ఈ ఒక్క లైన్ చాలు తన సినిమా ఎలా ఉంటుందో చెప్పేయొచ్చని అల్లు అర్జున్ తెలిపాడు. శిల్పకళావేదికలో జరిగిన ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తూ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నార'ని తనను అడగవచ్చని...దానికి 'దేవీ శ్రీప్రసాద్...మనం చేసేపని మనం ఏంటో చెబుతుందని, మనం ఉండాల్సిన అవసరం లేద'ని సమాధానమిచ్చాడని అన్నాడు. ప్రతి సినిమా తన కోసం ఆడాలని అనుకుంటానని, అయితే ఈ సినిమా మాత్రం తొలిసారి దిల్ రాజు కోసం బాగా ఆడాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

'దిల్'రాజు బ్యానర్ లో చేసిన 'ఆర్య' సినిమా నుంచి తన కెరీర్ ఇంచుమించు ప్రారంభమైందని, ఇప్పుడు తాను వారి 25వ సినిమాలో నటిస్తున్నానని, ఈ సినిమా ఆయన కోసం తప్పకుండా ఆడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తమను ఇంతకాలంగా ఆదరిస్తున్న మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ ధన్యవాదాలన్నాడు. మెగా ఫ్యామిలీ అభిమానులంటే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్, తనతో పాటు నిహారిక అభిమానులు కూడానని తెలిపాడు. వీరిని పేరు పేరునా చెప్పడానికి బదులుగా మెగా అభిమానులంటారని అన్నాడు.

దర్శకుల గురించి చెప్పాల్సి వస్తే....దర్శకరత్న దాసరి నారాయణ రావుగారి గురించి చెప్పుకోవాలని అన్నాడు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు లోటని అన్నాడు. తెలుగు సినిమా బతికున్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని అన్నాడు. ఆయనను చిరకాలం గుండెల్లో పెట్టుకుంటామని చెప్పాడు.

More Telugu News