: 5.4 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే సఫారీల ఆటకట్టు...భారత్ లక్ష్యం 192

వరుణుడు మ్యాచ్ కు అడ్డుపడకపోయినా 5.4 ఓవర్లు మిగిలి ఉండగానే భారత ఆటగాళ్లు సఫారీల ఆటకట్టించారు. ఊహించని విధంగా పుంజుకున్న టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆరంభం ఘనం, ముగింపు పేలవం అన్నట్టు సౌతాఫ్రికా ఆటతీరు కొనసాగింది. తొలి 20 ఓవర్లు అద్భుతంగా ఆడిన సౌతాఫ్రికా జట్టు తరువాత తేలిపోయింది. తొలి 20 ఓవర్లు పేలవంగా ఆడిన టీమిండియా ఆటగాళ్లు 25 ఓవర్ల తరువాత నెమ్మదిగా పుంజుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్ (53) అర్థ సెంచరీతో రాణించగా, హషీమ్ ఆమ్లా (35) దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు. అనంతరం వచ్చిన డివిలియర్స్ (16), మిల్లర్ (1) విఫలం కాగా, డుప్లెసిస్ (36) ఆకట్టుకున్నాడు. అనంతరం మోరిస్ (4), ఆండిల్ (4), రబడా (5) మోర్కెల్ (0), ఇమ్రాన్ తాహిర్ (1) దారుణంగా విఫలమయ్యారు. డుమిని నాటౌట్ గా నిలిచినా ధాటిగా ఆడడంలో విఫలమయ్యాడు. దీంతో 44.5 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు 191 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా, హార్డిక్ పాండ్య చెరొక వికెట్ తీసి చక్కగా సహకరించారు. ముగ్గురు బ్యాట్స్ మన్ రనౌట్ అయ్యారంటే టీమిండియా ఫీల్డింగ్ ఎలా ఉందో ఊహించవచ్చు.

More Telugu News