: పాకిస్థాన్ ప్రధానికి షాక్ ఇచ్చిన చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్‌

కజికిస్థాన్‌ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సమితి సదస్సులో భారత్‌, పాకిస్థాన్‌, చైనాల అగ్ర‌నేత‌లు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయి ప‌లు అంశాల‌పై చర్చించిన చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్‌... పాకిస్థాన్ ప్ర‌ధాని నవాజ్ ష‌రీఫ్‌తో మాత్రం భేటీ అవ్వ‌డానికి నిరాక‌రించి ఆయనకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ సదస్సులో జిన్‌పింగ్‌-షరీఫ్ మ‌ధ్య త‌ప్పకుండా చర్చ జ‌రుగుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, అందుకు భిన్నంగా జిన్ పింగ్ వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ అంశం చ‌ర్చ‌నీయాశంగా మారింది. మ‌రోవైపు జిన్‌పింగ్‌ భారత ప్రధాని మోదీతోనే కాక‌ తజికిస్థాన్‌, తుర్కమెనిస్తాన్‌, స్పెయిన్‌ల అగ్ర‌ నేతలతో కూడా భేటీ అయ్యారు.

ఇటీవ‌లే బలూచిస్థాన్‌లో ఇద్దరు చైనా జాతీయులను ఉగ్ర‌వాదులు కిడ్నాప్‌ చేసి హత్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనపై చైనా మండిపడుతోంది. ఈ కార‌ణంగానే ఆయ‌న పాకిస్థాన్ ప్ర‌ధానితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేద‌ని స‌మాచారం.

More Telugu News