: ఆ రాత్రి ఏం జరిగింది?...ఆమెపై ఎంతమంది అత్యాచారానికి పాల్పడ్డారు?

విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో ఉన్న ఒక స్టార్‌ హోటల్‌ లో పనిచేస్తున్న ఆంగ్లో ఇండియన్‌ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టింది ఎందరు? అన్న విషయాన్ని ఆరాతీసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే...ఆమె పని చేసిన హోటల్ లో శ్రీధర్‌ అనే వ్యక్తి బస చేశాడు. అతనికి అప్పటికే సదరు యువతితో పరిచయం వుంది. ఆ పరిచయంతో ఈ నెల 4వ తేదీ రాత్రి 11 గంటలకు ఆమెను బయటకు రావాలని కోరాడు.  హోటల్ వెనుక వున్న బీచ్ వద్దకు తీసుకెళ్లి, తెల్లవారు జామువరకు ఇద్దరూ కలిసి మందు (బీర్‌) కొట్టారు.  

ఒళ్లు తెలియని స్థితిలో పడివున్న ఆమెను మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది గుర్తించి ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టారు. ఆమె పరిస్థితి బాగాలేదని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చేసిన చికిత్సతో చాలా సేపటికి కోలుకున్న ఆమె తనపై గత రాత్రి సామూహిక లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. సిబ్బంది కూడా షాక్ తిన్నారు.

దీంతో హోటల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించిన అనంతరం ఈ నెల 8న వైజాగ్ త్రీ టౌన్ పోలీసులకు సామూహిక అత్యాచారంపై ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు. యువతిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని వార్తలు వచ్చినప్పటికీ ఆమెపై అత్యాచారానికి పాల్పడింది మాత్రం నలుగురు అని, ఇద్దరి ఆచూకీ తెలిసినా, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని, వీరిని పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

More Telugu News