: నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను...బిచ్చగాడిననుకుంటున్నావా?: కేకే ఆగ్రహం

గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములు ఎందుకు కొన్నారు? ఆయన కబ్జా కోరు అని తెలియకుండానే కొన్నారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే సహనం కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిధిలోని దండుమైలారం గ్రామంలో 50 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని చెప్పారు. ఆ భూముల పత్రాలన్నీ చూసిన తరువాతే తాము కొనుగోలు చేశామని అన్నారు. అందుకు సంబంధించిన పత్రాలన్నీ చూసిన తరువాత, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు.

 అయితే 'గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా?' అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ... బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో....'నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డారు. తరువాత 'రిజిస్ట్రార్ పెద్దా? సుప్రీంకోర్టు పెద్దా? చట్టాలు చేసే రాజ్యసభ సభ్యుడిని నాకు తెలియదా?' అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇందులో వివాదం ఏమీ లేదని, తాము సుప్రీంకోర్టు సూచనలతో రిజిస్టర్ చేయించామని, దీనిపై ఏవైనా వివాదం వస్తే....కోర్టు తీర్పు ధిక్కరణ కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు.

More Telugu News