: కబ్జా భూముల్ని కొన్న కేకే కుమార్తె... 50 ఎకరాల్లో 38 ఎకరాలు అక్రమమేనట!

ఇబ్రహీం పట్నం దండు మైలారంలో గోల్డ్ స్టోన్ కంపెనీ నకిలీ జీపీఏతో కబ్జా చేసిన భూకుంభకోణంలో భూములను టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కేకే కుటుంబం కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. దండుమైలారంలో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి 50 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, అందులో 38 ఎకరాలు గోల్డ్ స్టోన్ కబ్జా చేసినవే కావడం విశేషం. 2015 నుంచి ఈ భూములు వివాదాస్పద భూములుగా వ్యాజ్యం నడుస్తుండగా, గద్వాల విజయలక్ష్మి, జ్యోత్స్న, నవజ్యోతి పేరుతో 50 ఎకరాలు కోనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకోవడం విశేషం.

 ఇవి ప్రభుత్వ భూములని, రిజిస్ట్రేషన్లు అక్రమమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంతే కాకుండా ఈ భూములను అక్రమంగా రిజిస్టర్ చేసిన ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ ఖాదిర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ ముగ్గురు మహిళలు కేకే కుటుంబ సభ్యులు కావడంతో ఆయన దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ భూములను తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని, అయితే అందుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, తాము చట్టప్రకారమే భూములు కొనుగోలు చేశామని ఆయన చెప్పారు.

More Telugu News