: కర్నూలులో నడి రోడ్డుపై కొట్టుకున్న పోలీసులు!

కర్నూలు జిల్లాలో నడిరోడ్డు మీద పోలీసులు కొట్టుకోవడం వివాదాస్పదమైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...కర్నూలు జిల్లా ప్రధాన పట్టణంలోని రాజ్ విహార్ సర్కిల్ లో హుస్సేన్ అనే హోం గార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంతలో ఆ దారిలో మనోజ్ కుమార్, మణి కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ వెళ్తున్నా, వారు వెళ్లడం లేదు. దీంతో హుస్సేన్ వారి వద్దకు చేరుకుని, రద్దీగా ఉండే రోడ్డులో వాహనం ఆపితే ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని వెళ్లిపోవాలని కోరాడు.

దీంతో వెళ్లకపోతే ఏం చేస్తావంటూ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ హుస్సేన్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో వారి వాహనం తాళం స్వాధీనం చేసుకునేందుకు హుస్సేన్ ప్రయత్నించడంతో ఆగ్రహానికి గురైన మనోజ్ కుమార్ అతనిపై దాడికి దిగాడు. దీంతో హుస్సేన్ ఎదురు తిరిగాడు. దీంతో ఇద్దరూ నడిరోడ్డుపై కొట్టుకున్నారు. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వివాదం రేగింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే మనోజ్ కుమార్, మణికుమార్ ను సస్పెండ్ చేశారు. 

More Telugu News