: మాజీ ఏఎస్పీ వద్ద కళ్లు చెదిరే అక్రమాస్తులు.. రూ.400 కోట్లు కూడబెట్టాడు... ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నాడు!

కేరళలోని కోచిలో ఓ మాజీ ఏఎస్పీ కూడబెట్టిన అక్రమస్తులను గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. నాగాలాండ్‌లో ఏఎస్పీగా పనిచేసిన ఆయన రూ.400 కోట్ల విలువైన ఓ సంస్థకు అధినేత. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్రపతి అవార్డు కూడా అందుకోవడం గమనార్హం.

నాగాలాండ్‌లో అడిషనల్ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌గా పనిచేసిన ఎంకేఆర్ పిళ్లై.. పలువురు రాజకీయ నాయకులు, టాప్ బ్యూరోక్రాట్ల వద్ద పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ నిధులను ఏమైనా అక్రమంగా దారి మళ్లించారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కోణంలోనే పిళ్లైను ప్రశ్నించనున్నట్టు తెలిపారు.

కేరళ, కర్ణాటక, నాగాలాండ్, ఢిల్లీలో పిళ్లైకి చెందిన శ్రీవలసమ్ గ్రూప్ కార్యాలయాలపై అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈ దాడులు నిర్వహించినట్టు  అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత తన ఆస్తులు రూ.50 కోట్లని పిళ్లై ప్రకటించారు. అయితే అతడు చెప్పిన లెక్కలకు, చూపించిన ఆదాయానికి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించగా అక్రమ డొంక బయటపడింది.

More Telugu News