: అమ్మకు, దేవతకు ప్రతిరూపమే గోవు.. బాబర్, అక్బర్ చక్రవర్తులు కూడా గోవధను నిషేధించారు: ఉమ్మడి హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు

గోవు  పవిత్రమైన జాతీయ సంపద అని.. అది అమ్మకు, దేవతకు ప్రతిరూపమని హైదరాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న రాజస్థాన్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలను మర్చిపోకముందే హైదరాబాద్ హైకోర్టు జడ్జి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన 63 ఆవులతోపాటు రెండు ఎద్దులను పోలీసులు సీజ్ చేయడంపై పశువుల వ్యాపారి ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. బక్రీద్ సందర్భంగా మాంసం కోసం ఆవులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నానని నల్గొండకు చెందిన రమావత్ హనుమ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ బి.శివశంకర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా ఆరోగ్యంగా ఉన్న గోవులను వధించడానికి ముస్లింలకు ఎటువంటి ప్రాథమిక హక్కులు లేవన్నారు. మతాలు పేరు చెప్పి గోవును బలి ఇవ్వడాన్ని బాబర్ చక్రవర్తి కూడా నిషేధించాడని, ఆయన కుమారుడు హుమయూన్‌ కూడా దానిని కొనసాగించాలని ఆదేశించాడని చరిత్రను గుర్తు చేశారు. అక్బర్, జహింగీర్, అహ్మద్ షా వంటి వారు కూడా గోవధను నిషేధించారని తెలిపారు.

More Telugu News