: కోహ్లీ సహా 10 మంది వద్దంటున్నా... అనిల్ కుంబ్లే కొనసాగింపు?

భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా దాదాపు 10 మంది ఆటగాళ్లు కోచ్ అనిల్ కుంబ్లే తీరును నిరసిస్తూ, ఆయన వద్దని చెబుతున్నప్పటికీ, బీసీసీఐ మాత్రం కుంబ్లే వైపే మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డుకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరికి ఓ లేఖను రాస్తూ, కనీసం వెస్టిండీస్ పర్యటన ముగిసేంత వరకూ కొత్త కోచ్ నియామక ప్రక్రియను పక్కన బెట్టాలని లేఖ రాయడం గమనార్హం. ఈ విషయమై బోర్డు పాలక మండలి ఇంకా నిర్ణయం తీసుకోకున్నా, కుంబ్లేను మరికొంత కాలం అదే పదవిలో ఉంచాలని పలువురు బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక కొత్త కోచ్ వచ్చినా, లేక కుంబ్లే కొనసాగినా 2019 వరల్డ్ కప్ వరకూ కాంట్రాక్ట్ ఉంటుందని సీకే ఖన్నా స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్ లో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నందున, టోర్నీ జరుగుతున్న సమయంలో కోచ్ ఎంపికను కొనసాగించడం భావ్యం కాదని అమితాబ్ వ్యాఖ్యానించారు. ఈనెల 26న బీసీసీఐ సభ్యుల సమావేశంలో కోచ్ ఎంపికపై చర్చిద్దామని, అప్పటివరకూ మరో కోచ్ గురించి ఆలోచించ వద్దని మరో ప్రధాన అధికారి రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. కాగా, దిగ్గజ త్రయం సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లు సైతం కుంబ్లే వైపే మొగ్గు చూపుతుండటం అతనికి ప్లస్ పాయింట్ కానుంది.

More Telugu News