: హైదరాబాదులో బోర్డు తిప్పేసిన నాలుగు ఐటీ కంపెనీలు!

కేసీఆర్ ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేలా తీసుకువచ్చిన నూతన ఐటీ విధానాన్ని వాడుకుంటూ కేవలం మూడు నెలల క్రితం పుట్టిన కంపెనీ అది. రోజు మాదిరిగానే ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు ఆఫీసుకు తాళం వేసి వుండడం కనిపించింది. యజమానికి ఫోన్ చేసి అడిగితే, ప్రాజెక్టులు లేవని వారం రోజులు ఆగాలన్న సమాధానం వచ్చింది. ఒకటి, రెండు కాదు... ఎన్ని రోజులైనా ఆ తలుపులు తెరచుకోలేదు. ఈ కంపెనీలో ఉద్యోగం కోసం ఒక్కో టెక్కీ దాదాపు రూ. 2 లక్షల వరకూ సమర్పించుకున్నారు. ఇదొక్కటే కాదు. గడచిన వారం రోజుల్లో నాలుగు స్టార్టప్ కంపెనీలు బోర్డులు తిప్పేయగా, 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

మూడు దశల్లో ఇంటర్వ్యూలు ఉంటాయని, ఎంపికైతే సాలీనా రూ. 3 లక్షల ప్యాకేజీ ఉంటుందని చెబుతూ, కన్సల్టెన్సీల ద్వారా వస్తే, రూ. 2 లక్షలు, నేరుగా సెలక్టయితే రూ. 1.5 లక్షలు చెల్లించాలని ఈ కంపెనీలు షరతులు పెట్టాయి. దీంతో ఉద్యోగంపై ఆశతో ఎంతో మంది డబ్బు జమ చేశారు. కాగా, ఓ కంపెనీ మాత్రం మూసేసేముందు గట్టిగా ప్రశ్నించిన వారికి కొంత ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఇక బాధితులంతా మాదాపూర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News