: ఆ మహిళా ఎస్సైతో నాకు సంబంధం లేదు: రాయచూరు ఎమ్మెల్యే

ఓ మహిళా ఎస్సైతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ కర్ణాటకలోని రాయచూరు రూరల్ ఎమ్మెల్యే తిప్పరాజుపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ విషయం ఇప్పుడు అక్కడ పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వివాహేతర సంబంధానికి సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ కు ఆయన భార్య పేరుతో మార్చి 16న ఓ లేఖ కూడా అందింది. ఈ వ్యవహారం గురించి టీవీ చానళ్లలో సైతం కథనాలు వచ్చాయి. అయితే తాను ఆ లేఖ రాయలేదని ఎమ్మెల్యే భార్య తెలిపింది.

ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే తిప్పరాజు మాట్లాడుతూ తాను, తన భార్య అన్యోన్యంగా ఉన్నామని... కావాలనే తనపై ఎవరో బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరులోని విధానసౌధలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయిపై విమర్శలు గుప్పించారు. తనతో చర్చించకుండానే, లేఖకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వివరించారని... రాజకీయపరంగా తనను తొక్కేయడానికి తన ప్రత్యర్థులు పన్నిన కుట్రగా అనుమానం కలుగుతోందని చెప్పారు.

ఎస్ఐ బేబి మీడియాతో మాట్లాడుతూ, తన పరువుకు భంగం కలిగించేలా కొంత మంది ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికి పాల్పడ్డవారు ఎవరో గుర్తించి, వారిపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. 

More Telugu News