: కట్నం తీసుకోవడం నేరమైతే ఇవ్వడం కూడా నేరమే...నా భార్యపై కేసు నమోదు చేయండి: భర్త ఫిర్యాదు

సాధారణంగా వివాహ సమయాల్లో కట్నం ఎంతిస్తారని వరుడి కుటుంబ పెద్దలు అడగడం...వధువు కుటుంబ పెద్దలు వరుడు ఎంతలో ఉన్నాడని ఆరాతీసి, తామెంత ఇవ్వగలమో చెప్పడం, వివాహ సమయానికి మాట్లాడుకున్నంత కట్నం, లాంఛనాలు ఇచ్చి కుమార్తెను అప్పగించడం జరుగుతుంది. ఇలాగే గుంటూరుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, హైదరాబాదుకు చెందిన యువతిని మూడేళ్ల క్రితం ఘనంగా వివాహమాడాడు. మూడేళ్ల కాపురంలో కలతలు పెరగడంతో విడిపోయారు. దీంతో వధువు పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై వరకట్నం కేసు నమోదు చేశారు.

ఈ విషయం తెలిసిన ఆయన...తాను కట్నం తీసుకోవడం నేరమైతే, ఆమె కట్నం ఇవ్వడం కూడా నేరమేనని, ఆమెపై కూడా కేసు నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. దీనిని వారు పట్టించుకోకపోవడంతో ఆయన ఆర్టీఐ చట్టంకింద సికింద్రాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఆర్టీఐ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ను సంప్రదించారు. దీంతో కలెక్టర్ ఆర్డీవోను సమాచారం కోరగా, ఇలాంటి సమాచారం తమ వద్ద ఉండదని, అయితే దరఖాస్తుదారు సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని, పోలీసు కేసు నమోదు చేయకపోవడంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News