: బీజేపీకి ఎదురుదెబ్బ.. పశువుల అమ్మకాలపై నిబంధనలతో కినుక.. 5 వేల మంది పార్టీకి గుడ్‌బై!

బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పశువుల అమ్మకాలపై నిబంధనలు విధించడంతో కినుక వహించిన ఆ పార్టీ కార్యకర్తలు 5వేల మంది మేఘాలయలో పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీని వీడిన వారిలో తురా యూత్ వింగ్ అధ్యక్షుడు  విల్వెర్ గ్రెహమ్ దంగో కూడా ఉన్నారు. బీఫ్ తినే గిరిజన, ఇతర సామాజిక వర్గాలను అణగదొక్కేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకు నిరసనగానే తామంతా పార్టీకి రాజీనామా చేసినట్టు దంగో వివరించారు.

 మండల కమిటీలను రద్దు చేశామని, 5 వేల మంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారని తెలిపారు. తమ సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఏ పార్టీనైనా సహించబోమని తేల్చి చెప్పారు. వీరితోపాటు మేఘాలయ బీజేపీ సీనియర్ నేతలైన బచ్చు మరక్, బెర్నాండ్ మరక్‌లు కూడా పార్టీకి టాటా చెప్పేశారు. పశువుల విక్రయాలపై కొత్త నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. నూతన నిబంధనలతో రాష్ట్రంలో సగానికిపైగా పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు బీజేపీ ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియస్ లింగ్డో పేర్కొన్నారు.

More Telugu News