: సఫారీలకు భంగపాటు... డక్ వర్త్ లూయిస్ లో పాక్ ను వరించిన విజయం!

సౌతాఫ్రికాకు ఐసీసీ టోర్నీలు కలిసి రావడం లేదు. అద్భుతమైన ఆటగాళ్లతో కూడివున్న సఫారీ సేనకు భంగపాటు తప్పడం లేదు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వరుణుడు పాక్ ను కాపాడాడు. అద్భుతమైన బౌలింగ్ వనరులు కలిగిన సౌతాఫ్రికా జట్టు తమ 219 స్కోరును కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. పాక్ ఓపెనర్లు హసన్ అలీ (9), ఫకార్ జమాన్ (31) లను తొందరగానే పెవిలియన్ కు పంపింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జమాన్ ఫర్వాలేదనిపించాడు. అనంతరం బాబర్ అజామ్ (31) స్కోరు బోర్డు తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. అతనికి హఫీజ్ (26) చక్కగా సహకరించి అవుటయ్యాడు.

 దీంతో అజామ్ కి సీనియర్ షోయబ్ మాలిక్ (16) జతయ్యాడు. వీరిద్దరూ ఆడుతున్న సమయంలో వరుణుడు మ్యాచ్ కు అడ్డుపడ్డాడు. అప్పటికి పాక్ స్కోరు 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు. వరుణుడు దయచూపకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పధ్ధతిలో 4.38 రన్ రేట్ కలిగిన సఫారీ జట్టును 4.40 కలిగిన పాక్ 19 పరుగుల తేడాతో ఓడించిందని ప్రకటించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సఫారీల టాప్ ఆర్డర్ ను బలిగొన్న హసన్ అలీ నిలిచాడు. దీంతో గ్రూప్ బీ పోరు ఆసక్తికరంగా మారింది. ఒక్కో మ్యాచ్ గెలిచి టీమిండియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్ లు పాయింట్ల పట్టికలో సమఉజ్జీలుగా ఉన్నాయి. రన్ రేట్ పరంగా టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

More Telugu News