: ఏనుగుతో సెల్ఫీ కోసం మోజుపడ్డాడు.. గాయాలపాలయ్యాడు!

ప్రమాదకర ప్రదేశాల్లో, క్రూర జంతువులతో సెల్ఫీలు దిగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు ప్రతి రోజు ఎక్కడోచోట వస్తూనే ఉన్నప్పటికీ, యువతకి పట్టుకున్న సెల్ఫీ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా, సెల్ఫీల మోజులో పడి మరో యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్ ‌లోని మసానియా గ్రామంలోకి రెండు రోజులుగా ఉన్న‌ట్టుండి ఏనుగులు వ‌స్తున్నాయి. దీంతో ఊర్లోని వారంతా భయంతో వ‌ణికిపోతున్నారు.

అయితే, అభిషేక్ నాయక్ అనే యువ‌కుడు మాత్రం త‌మ గ్రామంలోకి ప్ర‌వేశించిన‌ ఏనుగుని చూసి దుస్సాహ‌సం చేశాడు. దానితో సెల్ఫీ దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాల‌నుకున్నాడు. ఏనుగుకి దగ్గర‌గా వెళ్లి స్మైల్ ఇస్తూ సెల్ఫీకి పోజిచ్చాడు. అంతే, ఒక్కసారిగా వెన‌క‌నుంచి ఆ ఏనుగు తొండంతో అతనిపై దాడి చేసింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. కింద ప‌డిపోయి ఏనుగుదాడికి గుర‌వుతున్న‌ అత‌డిని గ్రామస్తులంతా కలిసి లాక్కొచ్చారు. ప్ర‌స్తుతం అభిషేక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.             

More Telugu News