: పుంజుకున్న పాక్ ఆటగాళ్లు: సఫారీలకు చుక్కలు చూపి...6 వికెట్లు తీశారు!

పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ తో ఘోర పరాజయంపాలైన పాకిస్థాన్ జట్టు జూలు విదిల్చింది. భారత్ పై ఆడిన జట్టేనా? అన్న అనుమానం వచ్చేలా ఆడి ఆకట్టుకుంది. అస్థిరమైన జట్టుగా, ఎప్పుడెలా ఆడుతుందో తెలియని జట్టుగా పేరున్న పాకిస్థాన్ జట్టు మరోసారి తన స్వభావాన్ని ప్రదర్శించింది. నిప్పులు చెరిగే లైన్ అండ్ లెంగ్త్ బంతులు, మైదానంలో పరుగులు ఆపేందుకు డైవ్ లు, గాల్లో లేచిన బంతిని సమర్థవంతంగా పట్టుకోవడం చూస్తే... టీమిండియాపై ఆడిన పాక్ జట్టేనా? అన్న సందేహం వస్తోంది.

ప్రపంచ క్రికెట్ లో పేరున్న ఆమ్లా, డివిలియర్స్, డుప్లెసిస్, డుమినిలను అద్భుతమైన బంతులతో పెవిలియన్ చేర్చారు. దీంతో వికెట్లు కాపాడుకుంటూ పరుగులు చేసేందుకు సఫారీలు తీవ్రంగా చెమటోడ్చారు. ఈ నేపథ్యంలో 30 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు 120 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ మూడు వికెట్లు తీసి రాణించగా, రెండు వికెట్లతో ఇమాద్ ఆకట్టుకున్నాడు. ఒక వికెట్ తీసిన హఫీజ్ వారికి సహకరించాడు. క్రీజులో మిల్లర్ కు జతగా మోరిస్ ఆడుతున్నాడు.

More Telugu News