: కుంబ్లే రాక్షసుడు... ప్రాక్టీస్ ఎగ్గొడితే అస్సలు ఊరుకోడు!: ఆటగాళ్ల ఫిర్యాదు

టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం జూన్ 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోచ్  గా కుంబ్లేను కొనసాగించాలా? లేక కొత్త వ్యక్తిని నియమించాలా? అన్న దానిపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త కోచ్ ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేసిన బీసీసీఐ, జట్టు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, జట్టు మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌, క్రికెట్‌ సలహా మండలి సభ్యుడు గంగూలీ పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు కుంబ్లే పర్యవేక్షణపై ఆరోపణలు గుప్పించారు. ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడాన్ని ఏమాత్రం సహించడని, ప్రాక్టీస్ లో దెబ్బలు తగిలినా పట్టించుకోడని, ప్రాక్టీస్ చేయాల్సిందేనని చెబుతాడని, ఆ సమయంలో మానవత్వం మరచి, రాక్షసుడిలా వ్యవహరిస్తాడని ఫిర్యాదు చేశారు. సుమారు 10 మంది ఆటగాళ్లు ఇదే రకమైన ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

రవిశాస్త్రి అలా కాదని, ఆటగాళ్లతో స్నేహంగా, సరదాగా ఉండేవాడని వారు చెప్పారు. దీనిపై సీనియర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కుంబ్లే అలా ఉండడం వల్లే జట్టు విజయాల పరంపర కొనసాగిస్తోందని, జట్టుపట్ల కోచ్ కఠినంగా ఉండాల్సి ఉంటుందని, అలా ఉంటేనే సానుకూల ఫలితాలు వస్తాయని, లేని పక్షంలో జట్టు పరాజయాల బాటపట్టే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రాక్టీసే కదా అని కోచ్ అలసత్వం ప్రదర్శిస్తే... ఫలితం కూడా అలానే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.  

More Telugu News