: యూపీలో దారుణం.. వ్యాపారి కుటుంబాన్ని కాల్చిచంపిన దుండగులు

ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యాపారి కుటుంబాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లక్నోకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్ లో ఈ దారుణం జరిగింది. వ్యాపారవేత్త సునీల్ జైస్వాల్ (60) అత్యంత ఖరీదైన సివిల్ లైన్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి బైక్ పై తన కుమారుడు రితిక్ (25)తో కలిసి ఆయన తన ఇంటికి బయలుదేరారు. సుమారు 9.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న వారిపై అప్పటికే కాపు కాచి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఇద్దరినీ కాల్చి చంపారు.

తుపాకీ కాల్పుల శబ్దం విన్న జైస్వాల్ భార్య బయటకు పరిగెత్తుకుని రావడంతో, ఆమెను కూడా వాళ్లు కాల్చిచంపారు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై కూడా వారు కాల్పులు జరిపారు. అయితే, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులకు సదరు వ్యక్తి సమాచారం అందివ్వడంతో, వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ కోసం వచ్చిన దుండగులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసుల ప్రాథమిక సమాచారం.

More Telugu News