: భార్యను దారుణంగా చంపేసి.. ఆమె మృతదేహాన్ని తగులబెట్టిన భర్త!

గుంటూరు జిల్లా పట్నంబజారు సంపత్‌నగర్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పెళ్ల‌యిన 20 ఏళ్ల‌కు మ‌రో మ‌హిళ‌ను పెళ్లి చేసుకున్న ఓ భ‌ర్త, త‌న మొద‌టి భార్య‌తో గొడవ పడుతూ ఆమెను దారుణంగా హ‌త్య చేసి బొంతపాడు శివారులో ఆమె మృతదేహాన్ని తగులబెట్టాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. బద్రి రాఘవయ్య(45), కల్యాణి(43) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కల్యాణి ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తోంది. అయితే, కొన్నేళ్ల క్రితం రాఘవయ్య మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న కల్యాణి ఆయనను నిలదీసింది. ఆమె విష‌య‌మై కొన్ని నెల‌లుగా వారిద్ద‌రు గొడ‌వ ప‌డుతున్నారు. కాగా, రెండో భార్య కొన్ని నెలలక్రితం అనారోగ్యంతో మృతిచెందింది.

కొన్ని రోజుల క్రితం రాఘ‌వ‌య్య కూడా అనారోగ్యానికి గుర‌య్యాడు. ఆయ‌న‌ను కల్యాణి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించింది. మొన్న‌ రాత్రి ఇంట్లో భార్యభర్తల మధ్య గొడ‌వ చెల‌రేగింది. అనంత‌రం క‌ల్యాణి క‌నిపించ‌కుండా పోయింది. దీంతో తన తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు శ్రీనివాస్‌(16)  పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ రోజు ఉదయం బొంతపాడు వ‌ద్ద‌ సగం కాలిన ఓ మహిళ మృతదేహం క‌న‌ప‌డ‌డంతో అది కల్యాణిదేన‌ని పోలీసులు గుర్తించారు. ఆమె భ‌ర్తే ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News