: పరువు హత్య.. గర్భిణీ అయిన కూతురిని సజీవదహనం చేసిన కుటుంబసభ్యులు

కొంత కాలం క్రితం దళితుడిని వివాహం చేసుకుందనే కోపంతో గర్భిణీ అయిన కుమార్తెను ఆమె కుటుంబసభ్యులు సజీవదహనం చేసిన దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బీజాపూర్ కి చెందిన ముస్లిం యువతి భాను బేగం అదే జిల్లాకు చెందిన శరణప్ప అనే దళిత యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని వారి కుటుంబసభ్యులకు చెప్పారు. అయితే, వారి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో, శరణప్ప, బేగంలు గోవాకు పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఆమె గర్భవతి అవడం జరిగింది.

తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారనే వాళ్లిద్దరూ ఆశించారు. ఈ క్రమంలో భాను బేగం తన భర్తతో కలిసి బీజాపూర్ లోని తన ఇంటికి వెళ్లింది. వారిని చూసి ఆగ్రహించిన బేగం తల్లిదండ్రులు, శరణప్పను వదిలివేయాలని తమ కూతురికి చెప్పారు. అందుకు, ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో శరణప్పపై బేగం కుటుంబసభ్యులు దాడి చేశారు. వారి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డ శరణప్ప, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరణప్ప సహా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే, గర్భవతి భాను బేగంను ఆమె కుటుంబీకులు సజీవదహనం చేశారు. భాను బేగంను కాపాడేందుకు భర్త శరణప్ప చేసిన ఫలితాలు విఫలమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడ్డ భాను బేగం కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News