: రూ. 4 కోట్ల లాభం సంపాదించిన చంచల్ గూడ జైలు ఖైదీలు!

క్షణికావేశంలో నేరాలు చేసి జీవిత ఖైదును అనుభవిస్తున్న చంచల్ గూడ జైలు ఖైదీలు ఏకంగా రూ. 4 కోట్లను లాభంగా జైళ్ల శాఖకు అందించారు. 45 మంది జీవిత ఖైదీలతో పాటు ఖైదు శిక్షను పూర్తి చేసుకున్న 16 మందితో చంచల్ గూడలో నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు ఈ సంవత్సరం రూ. 4 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. పెట్రోలు విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసిందని జైలు సూపరింటెండెంట్ బీ సైదయ్య వెల్లడించారు. ఈ లాభాన్ని జైళ్ల శాఖ అభివృద్ధికి వినియోగించనున్నట్టు తెలిపారు.

డీజిల్ అమ్మకాలు స్వల్పంగానే సాగినప్పటికీ, పెట్రోలు విభాగంలో రూ. 120 కోట్ల వార్షిక టర్నోవర్ ను నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న ఖైదీలకు నెలకు రూ. 12 వేల వేతనం ఇస్తున్నామని తెలిపారు. ఖైదీల సత్ప్రవర్తన, కుటుంబంతో ఉన్నప్పుడు సంబంధాలు, పెరోల్ తరువాత సమయానికి జైలుకు తిరిగిరాక తదితర విషయాలను పరిశీలించి, ఇక్కడ ఉద్యోగం చేసే వారిని ఓ కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపారు. తాము పెట్రోలు బంకులో ఉద్యోగం ఇచ్చిన వారు ఇంతవరకూ పారిపోలేదని తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం పెట్రోలు బంకును నడుపుతున్నామని, ఇక్కడ కల్తీలేని పెట్రోలు లభిస్తుండటంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడించారు.

More Telugu News