: లండన్ దాడితో పాక్‌కు లింక్.. ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్థానీ!

శనివారం లండన్‌ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురిలో ఒకరు పాకిస్థానీ జాతీయుడని తేలింది. దీంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి అటువైపు మళ్లింది. శనివారం నాటి ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ముగ్గురు దుండగులను పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 12 మందిని అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని గుర్తించిన పోలీసులు వారిలో ఒకరు పాకిస్థాన్ మూలాలు ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.

మొరాకోకు చెందిన రాచ్‌డ్ రెడౌన్స్ (30) అలియాస్ రాచిడ్ ఎల్ఖ్‌దార్, మరో ఉగ్రవాది బట్‌ ఇద్దరూ తూర్పు లండన్‌లోని ఒకే ప్రాంతంలో నివసించినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడికి ముందు బట్ అలియాస్ అబ్జ్‌తో తాను మాట్లాడినట్టు అతడి ఇంటి పక్కన నివసించే ఓ వ్యక్తి తెలిపాడు. అతడు ఎప్పుడూ కలుపుగోలుగా ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు. బట్‌ పాకిస్థానీ మూలాలున్న వ్యక్తి అని, ఇస్లామిక్ మత గురువు అహ్మద్ మూసా జిబ్రిల్ ప్రసంగాలతో అతడు ఉగ్రవాదిగా మారినట్టు అతడి స్నేహితులు తెలిపారు.


More Telugu News