: కూటి కోసం 'కోతి' విద్యలు!: భక్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్న కోతులు!

ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో మనుషులను కోతులు బ్లాక్ మెయిల్ చేస్తూ, బెంబేలెత్తిస్తున్నాయి. మామూలుగా కాదు, వాటి కంట పడ్డ మనిషి గజగజా వణికిపోవాల్సిందే. మనుషులని బెదిరించడంలో ఆరితేరిపోయాయి. బాలిలో ఉలువాతు అనే ఆలయంలో దైవ ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్న‌ భక్తులను ఈ కోతులు బెదిరించి, దొంగతనాలు చేస్తున్నాయి. ఆ ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లో కోతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇన్నాళ్లూ భక్తుల వ‌ద్ద‌కు దొంగ‌చాటుగా వ‌చ్చి వారి నుంచి ఆహార పదార్థాలు లాక్కెళ్లేవి. కానీ, ఇప్పుడు త‌మ పంథాను మార్చుకున్నాయి. ఇలా బెదిరించి దొంగ‌త‌నాలు చేయ‌డం మ‌నుషుల‌ను చూసే నేర్చుకున్నాయా? అన్న‌ట్లు.. అక్క‌డ‌కు వ‌చ్చే భక్తులు, ప‌ర్యాట‌కుల‌పై ఎగబడి వారి నుంచి బ్యాగులు, కళ్లద్దాలు, చెప్పులు, ఫోన్లు వంటి వ‌స్తువులను తీసుకెళ్తున్నాయి.

ఆ వ‌స్తువుల‌ను తిరిగి అందించాలంటే ఆ కోతులకు కాస్త ఆహారం అందించాలి. ఆహారం ఇస్తే మ‌ళ్లీ ఆ వస్తువులను అక్కడ పెట్టేసి వెళ్లిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే ప‌రిస్థితి. దీనిపై ప‌లువురు పరిశోధకులు అధ్యయనం చేయ‌గా, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ ఆలయం వద్ద కోతులు నాలుగు బృందాలుగా ఉంటే, వాటిల్లో రెండు గ్రూపులు మాత్రం ఇటువంటి దొంగతనాల్లో పీహెచ్‌డీ ప‌ట్టా తీసుకున్నట్లు చాక‌చ‌క్యంగా వ్యవ‌హ‌రిస్తున్నాయట.          

More Telugu News