: రాహుల్ సభను చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోంది: కేవీపీ

విభజన రాజకీయాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టింది పేరని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను సాధించుకునే దమ్ము చంద్రబాబుకు లేదని... అందుకే తమపై విమర్శలు చేస్తూ, కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జాతీయ నాయకులంతా మద్దతు పలికారని... అయినా, చంద్రబాబుకు మాత్రం కళ్లు తెరుచుకోవడం లేదని మండిపడ్డారు.

విభజన రాజకీయాలు, రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు పూర్తిగా కోల్పోయారని అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ సభను చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోందని చెప్పారు. ఈ భరోసా సభ ద్వారా బీజేపీ, టీడీపీ కుట్రలను ఎండగడతామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని... అప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. 

More Telugu News