: ఏవేవో రాస్తున్నారు.. అవన్నీ నిజం కాదు: కోహ్లీ

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తలను కెప్టెన్ కోహ్లీ కొట్టిపారేశాడు. భారత్-పాక్ మ్యాచ్ కు ముందు బర్మింగ్ హామ్ లో మీడియాతో మాట్లాడుతూ, కుంబ్లేతో తనకు ఎలాంటి సమస్య లేదని... లేని సమస్యను ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. అనిల్ కుంబ్లేతో కలసి పని చేయడం తనకు హాయిగా ఉందని చెప్పాడు. కొంతమంది తాము బతకడం కోసం సమస్యలను సృష్టిస్తారని, ఏదేదో రాస్తారని అన్నాడు. మన దేశంలోని ప్రజలకు ఓపిక చాలా తక్కువని... కరెక్టా? తప్పా? అనే విషయం కూడా తెలుసుకోకుండానే వివాదాస్పదం చేసేస్తారని తెలిపాడు. ప్రస్తుతానికైతే తమ దృష్టి మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ మీదే ఉందని చెప్పాడు.

పాక్ తో జరగనున్న మ్యాచ్ గురించి మాట్లాడుతూ, సరైన బౌలింగ్ కాంబినేషన్ ను ఎంచుకోవడమే తమ ముందున్న అతి పెద్ద సవాల్ అని కోహ్లీ చెప్పాడు. పాక్ తో జరగనున్న మ్యాచ్ ను తాము ప్రత్యేకంగా చూడటం లేదని... ఇతర మ్యాచ్ ల లాంటిదే ఈ మ్యాచ్ కూడా అని తెలిపాడు.

More Telugu News