: హై ఓల్టేజ్ మ్యాచ్ నేడే.. ఛాంపియన్ ఎవరో తేల్చుకునేందుకు భారత్, పాక్ రె'ఢీ'!

దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ ను వీక్షించడానికి భారత్, పాక్ క్రికెట్ అభిమానులు రెడీ అయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్, పాక్ లు తలపడుతున్నాయి. ఏయే జట్టులో ఎవరెవరు ఉన్నారో అనవసరం... గత రికార్డులు అనవసరం... ఎవరు ఫామ్ లో ఉన్నారో అనవసరం... అంతిమంగా ఏ జట్టు తమ జాతీయ జెండాను రెపరెపలాడిస్తుందన్నదే ఇక్కడ అవసరం. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించే క్రికెట్ వార్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభంకానుంది.

ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరేట్ అని ఇప్పటికే పలువురు క్రికెట్ దిగ్గజాలు అంచనా వేశారు. కోహ్లీ సారధ్యంలోని టీమిండియా టీమ్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. పైగా ఐసీసీ నిర్వహించిన ఈవెంట్లలో పాక్ పై భారత్ రికార్డే మెరుగ్గా ఉంది. 2012 టీ20 వరల్డ్ కప్ నుంచి 2016 టీ20 ప్రపంచ కప్ వరకు ఇరు జట్లు ఐదు సార్లు తలపడితే... అన్నింట్లోనూ ఇండియానే విజయబావుటా ఎగురవేసింది. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్ గెలుపొందింది.

కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్, ధోనీలతో కూడిన బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. పేస్ బౌలింగ్ విభాగం కూడా మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది. ఇంగ్లండ్ పిచ్ లు పేస్ కు సహకరించనున్న నేపథ్యంలో, భారత్ నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే జడేజా, అశ్విన్ లలో ఒకరు బెంచ్ కే పరిమితం కావచ్చు.  

More Telugu News