: లండన్ బ్రిడ్జిపై ఉగ్రదాడి.. పాదచారులను కారుతో తొక్కించుకుంటూ పోయిన ఉగ్రవాది.. కత్తిపోట్లు, కాల్పులు!

లండన్‌లో మరోమారు ఉగ్ర కలకలం రేగింది. శనివారం రాత్రి లండన్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా దిశ మార్చుకుని బీభత్సం సృష్టించింది. కారులోని దుండగులు పాదచారులను తొక్కించుకుంటూ ముందుకుసాగారు. అదే వేగంతో ముందుకెళ్లి బోరో మార్కెట్ వద్ద ఆగిన దుండగులు కిందికి దిగి కనిపించిన వారిని కత్తితో పొడిచినట్టు తెలుస్తోంది. అలాగే కాల్పులు కూడా వినిపించినట్టు కొందరు ప్రత్యక్ష  సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు.

లండన్ బ్రిడ్జి, బోరో మార్కెట్‌లో జరిగిన దాడులు రెండూ ఉగ్రదాడులేనని పోలీసులు పేర్కొన్నారు. అలాగే వాక్స్‌హాల్ ప్రాంతంలోనూ మరో దాడి జరిగినట్టు తెలుస్తున్నా పూర్తి సమాచారం లేదు. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. తాజా దాడులను ఉగ్రదాడులగానే పరిగణిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు.

More Telugu News