: దీంతో కుల వివక్ష మలినాలను కడిగేసుకోండి!: సీఎం యోగికి ప్రత్యేక సబ్బును పంపిస్తున్న 'గుజరాత్ దళిత్' సంస్థ!

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు 16 అడుగుల సబ్బును పంపించబోతున్నామని 'గుజరాత్ దళిత్' సంస్థ నేతలు ప్రకటించారు. ఈ సబ్బుతో ఆయన తన కుల వివక్షను కడిగేసుకోవాలని వారు అన్నారు.

యూపీలోని కుషినగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉన్న దళితవాడలో ఈ మధ్య కాలంలో యోగి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న దళితులకు సబ్బులు, షాంపూలు, పౌడర్లు, సెంటులను అధికారులు ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలవాలనుకునేవారు శుభ్రంగా స్నానం చేసి, పౌడరు, సెంటు కొట్టుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో, యోగిపై 'గుజరాత్ దళిత్' సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కోసం 16 అడుగుల సబ్బును పంపుతున్నామని... దళితులను కలిసేందుకు వచ్చేముందు... ఈ సబ్బుతో ఆయన స్నానం చేసి రావాలని తెలిపింది.

ఈ నెల 9వ తేదీన అహ్మదాబాద్ లో జరిగే  ఓ కార్యక్రమంలో ఈ భారీ సబ్బును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆ తర్వాత దాన్ని ప్యాక్ చేసి, సీఎంకు పంపనున్నట్టు సమాచారం. దళితుల్లోని వాల్మీకి వర్గానికి చెందిన ఓ మహిళతో ఈ సబ్బును తయారు చేయిస్తున్నారట. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ ప్రతిబంధ్ సమితి సభ్యులు మాట్లాడుతూ... యోగి వైఖరి మనువాదాన్ని తలపిస్తోందని మండిపడ్డారు. మలినమైన ఆలోచనలను ఆయన కడిగేసుకోవాలని సూచించారు. 

More Telugu News