: సర్జికల్ దాడులు అనూహ్య ఫలితాలను ఇచ్చాయి.. కశ్మీర్ లో తీవ్రవాదమే లేకుండా చేస్తాం : రాజ్ నాథ్

పాక్ ఆక్రమిత కశ్మీరులో గత ఏడాది సెప్టెంబర్ లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులు అనూహ్య ఫలితాలను ఇచ్చాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడుల కారణంగా మన దేశంలోకి చొరబడుతున్న టెర్రరిస్టుల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. సర్జికల్ దాడులు జరగడానికి ముందు ఆరు నెలల కాలంతో పోలిస్తే... చొరబాట్ల సంఖ్య 45 శాతం తగ్గిపోయిందని వెల్లడించారు. గత మూడు నెలల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనతల గురించి ఈ రోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ లో కూడా ఈ మూడు నెలల కాలంలో భద్రతాపరంగా మెరుగైన పరిస్థితి నెలకొందని రాజ్ నాథ్ చెప్పారు. మన భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ ప్రజలపై తనకు ఎంతో నమ్మకం ఉందని... రానున్న రోజుల్లో కశ్మీర్ లో టెర్రరిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కచ్చితంగా చెప్పగలనని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని... అయినప్పటికీ ఇంతవరకు భారత్ లో ఐఎస్ఐఎస్ అడుగుపెట్టలేక పోయిందని చెప్పారు. గత మూడేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా 90కి పైగా ఐసిస్ మద్దతుదారులను అరెస్ట్ చేశామని చెప్పారు. మావోయిస్టుల హింసను కూడా 25 శాతం వరకు కట్టడి చేశామని తెలిపారు.

More Telugu News