: నేను పాకిస్థాన్ కి మద్దతివ్వమని అడగను... అతను భారత్ కి మద్దతివ్వమని అడగడు: పాక్ టెన్నిస్ ఆటగాడు

'పాకిస్థాన్ కి మద్దతివ్వు' అని నేను అతనిని అడగను, అలాగే భారత్ కి మద్దతివ్వు అని తను నన్ను అడగడు అంటూ రోహన్ బోపన్న గురించి పాకిస్థాన్ టెన్నిస్ ఆటగాడు ఖురేషీ తెలిపాడు. 'స్టాప్ వార్.. స్టార్ట్ టెన్నిస్' పేరిట భారత్-పాక్ మద్య స్నేహబంధానికి వీరిద్దరూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పారిస్ లోని ఫ్రెంచ్ ఓపెన్ లో వీరిద్దరూ తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి రౌండ్ లోనే ఓటమిపాలైన ఖురేషీ రేపు జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు లండన్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఒక ఛానెల్ తో మాట్లాడుతూ, తాము చాలా కాలంగా స్నేహితులమని అన్నాడు. టెన్నిస్‌ కోర్టు బయటైనా, లోపలైనా రోహన్‌ నాకు సోదరుడులాంటి వాడని చెప్పాడు. భారత్-పాక్ మధ్య విభేదాలకు ఏవో కారణాలున్నాయి. కానీ తమ మధ్య అలాంటివి లేవని, తామిద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటామని చెప్పాడు.

 'రోహన్‌ పాక్‌ కు మద్దతివ్వాలని నేను కోరను. అలాగే నన్ను భారత్‌ కు మద్దతివ్వమని రోహాన్‌ అడగడని' చెప్పాడు. టెన్నిస్‌ లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టక ముందు తామిద్దరం కలిసి క్రికెట్‌ ఆడేవాళ్లమని, దక్షిణాఫ్రికాలో భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ని ఇద్దరమూ కలిసి ప్రత్యక్షంగా వీక్షించామని ఖురేషీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ లో పాక్ పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిందని చెప్పాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ జట్టు భారత్‌ పై గెలిచి టైటిల్‌ గెలవకపోయినా పెద్దగా పట్టించుకోరని, అదే భారత్‌ పై ఓడి టైటిల్‌ గెలిచినా ఉపయోగం ఉండదని, భారత్ తో ఓటమి గురించే ప్రశ్నిస్తారని ఖురేషీ చెప్పాడు. భారత్ పై గెలిస్తే ఘన స్వాగతం ఉంటుందని, భారత్ పై ఓడితే మాత్రం చీత్కారాలు తప్పవని స్పష్టం చేశాడు.

More Telugu News