: రెండు బలమైన జట్ల మధ్య నేటి మ్యాచ్!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేటి మధ్యాహ్నం బర్మింగ్ హామ్ లో ప్రారంభం కానున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ను రెండు సమఉజ్జీల పోరాటంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండు జట్లు ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో మాత్రం కివీస్ తో పోల్చుకుంటే ఆసీస్ బలంగా ఉంది. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మ్యాక్స్ వెల్, వేడు, హెన్రిక్స్, లిన్ తదితరులు బ్యాటుతో పరుగుల వరద పారించగలరు.

ఇక కివీస్ జట్టులో విలియమ్సన్, గుప్తిల్, ఆండర్సన్, రోంచి, గ్రూమ్, గ్రాండ్ హోం, బ్రూమ్, నీషమ్ వంటి ఆటగాళ్లున్నారు. అయితే ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నిరూపించుకోగా, కివీస్ స్టార్ ప్లేయర్లు స్థాయికి తగ్గట్టు రాణిస్తే విజయానికి ఢోకా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం గ్రూప్ బిలో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో వాతావరణ, పిచ్ పరిస్థితులు ఒకేలా ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

More Telugu News