: భారత్‌కు సపోర్టుగా ఉంటాం.. పాకిస్థాన్‌తో మాకు ఎలాంటి మిస్సైల్స్ సంబంధాలు లేవు: పుతిన్‌

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ర‌ష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఆ దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పుతిన్ మాట్లాడుతూ... భారత్ తో త‌మ దేశం ఎంతో నమ్మకమైన సంబంధాలను కలిగి ఉందని చెప్పారు. భార‌త్ త‌మ‌కు అత్యంత సన్నిహిత మిత్ర దేశ‌మ‌ని అన్నారు. త‌మ‌కు పాకిస్థాన్ తో పాటు ఇత‌ర దేశాల‌తో స‌త్సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ భార‌త్‌తో త‌మ‌ స్నేహానికి అవి ఎటువంటి విభేదాలు తీసుకురావని చెప్పారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో తాము ఇండియాకు ఎల్ల‌ప్పుడూ మద్దతిస్తామని అన్నారు.

ఉగ్ర‌దాడులు చేయ‌డం అనే విష‌యం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పుతిన్ అన్నారు. తాము భారత్ కు సపోర్టుగా ఉంటామని చెప్పారు. పాకిస్థాన్‌తో తమకు ఎలాంటి మిస్సైల్స్ సంబంధాలు లేవని అన్నారు. మ‌రోవైపు మిస్సైల్స్ వంటి అతి సున్నితమైన విషయాల్లో తాము అత్య‌ధికంగా భారత్‌తోనే స‌న్నిహితంగా ఉంటామ‌ని చెప్పారు. 100 కోట్లకు పైగా జనాభాతో ఇండియా అతి పెద్ద దేశంగా ఉంద‌ని, త‌మ‌ది కూడా పెద్ద దేశమేన‌ని చెప్పారు. భార‌త్‌తో త‌మ దేశానికి స‌త్సంబంధాలు బ‌లంగా ఉన్నాయ‌ని తెలిపారు.        

More Telugu News