: వృద్ధాశ్రమంలో చేరిన అలనాటి నటి గీతా కపూర్‌.. తన కొడుకు కొట్టేవాడని ఆవేదన!

సూపర్ హిట్ హిందీ చిత్రం 'పాకీజా' ఫేం గీతా కపూర్‌ను ఇప్పుడు క‌ష్టాలు చుట్టుముడుతున్నాయి. మ‌నవ‌ళ్ల‌తో ఆడుకుంటూ శేష జీవితాన్ని హాయిగా గ‌డ‌పాల్సిన వయసులో ఆమె.. ఓల్డ్ ఏజ్ హోంలో చేరారు. అది కూడా తన కొడుకు లేక కూతురు తీసుకువ‌స్తే కాదు.. పోలీసులు ఆమెను అందులో చేర్పించాల్సి వ‌చ్చింది. గ‌త నెల‌ 21న ఆమె రక్తపోటుతో బాధపడుతుండగా ఆమె కుమారుడు రాజా కపూర్ ఆమెను ఆసుప‌త్రి వ‌ద్ద వదిలేసి మ‌ళ్లీ తిరిగి రాకుండా వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆసుపత్రి వైద్యులే సొంత ఖ‌ర్చుల‌తో ఆమెకు వైద్యం అందిస్తున్నారు.

మ‌రోవైపు ఆమె కూతురు కూడా క‌నీసం ఫోనులో కూడా స్పందించ‌డం లేదు. దీంతో ఆసుపత్రిలో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెను ఈ రోజు పోలీసులు వృద్ధాశ్రమానికి తరలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను వదిలించుకోవాలని తన కొడుకు చూసేవాడని చెప్పింది. అందుకే తనను ఆస్పత్రిలో వదిలేసి పోయాడని తెలిపింది. తాను త‌న కుమారుడి చర్యలను తప్పుబట్టడంతో  త‌న‌ను కొట్టేవాడని చెప్పింది. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడని, ప‌లుసార్లు త‌న‌ను గదిలో బంధించిన ఘ‌ట‌న‌లు కూడా జ‌రిగాయ‌ని, తాను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడని చెప్పింది.

More Telugu News