: రేపు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు న‌వ‌నిర్మాణ దీక్ష‌: ఏపీ సీఎం చ‌ంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేసిన వారు సిగ్గుప‌డేలా అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమ‌రావ‌తిలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... రేపు న‌వ‌నిర్మాణ దీక్ష చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. రేపు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఈ దీక్షలో అందరూ పాల్గొనాలని సూచించారు. రేపటి నుంచి ఏడురోజుల పాటు అన్యాయంగా రాష్ట్ర‌ విభ‌జ‌న జ‌రిపిన‌ రోజును గుర్తు చేసుకుందామ‌ని, ఏ స్థితి నుంచి అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టామో చ‌ర్చించుకుందామ‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లుపై చ‌ర్చిద్దామ‌ని, మూడేళ్ల‌లో ఏం సాధించామో స‌మీక్ష చేసుకుందామ‌ని అన్నారు.

ఇప్పుడు క‌రెంటు లేని ఇళ్లు ఎక్క‌డాలేవని చంద్ర‌బాబు అన్నారు. ఎల్లుండి కూడా అంతా స‌మావేశమై కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఏమి చేయాలో తాము చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. దేశంలో మధ్యప్రదేశ్ తరువాత వ్యవసాయంపై ఎక్కువ‌గా ఆధార‌ప‌డిన వారు ఏపీలో ఉన్నారని అన్నారు. అర్బ‌న్ ఏరియాలు ఎక్కువ‌గా లేవు కాబ‌ట్టి రాష్ట్రానికి ఆదాయం త‌క్కువ‌గా ఉందని చెప్పారు. ఆర్థిక సంస్క‌ర‌ణ ఫ‌లితాలు పేద‌వారికి చేరే అంశంపై చర్చిద్దామ‌ని అన్నారు. పార్ల‌మెంటులో త‌లుపులు వేసేసి, ప‌ద్ధ‌తి లేకుండా రాష్ట్రాన్ని విభ‌జించారని అన్నారు.  హైద‌రాబాద్ లాంటి న‌గ‌రం క‌ట్టాలంటే 5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతాయని తెలిపారు. నిరాశకు లోనైన ప్రజలకు తాను భరోసా ఇచ్చానని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాశనమైపోయిన జపాన్ ఓ కసి, తపనతో పుంజుకుందని, అలాంటి కసితోనే ఏపీని కూడా ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. తాము కరవును ఎదుర్కోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నామని తెలిపారు. నవనిర్మాణ దీక్షను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు.

More Telugu News