: జాదవ్ కేసులో కీలక ట్విస్ట్... విడుదలకు బదులుగా హబీబ్ ను అప్పగించాలని డిమాండ్!

భారత నావికాదళ మాజీ అధికారి, పాక్ కోర్టులో ఉరిశిక్ష పడ్డ కులభూషణ్ జాదవ్ కేసు కీలక మలుపు తిరిగింది. అతన్ని తిరిగి భారత్ కు తీసుకురావాలని ఇండియా ప్రయత్నాలు చేస్తున్న వేళ, నేపాల్ లో అదృశ్యమైన తమ సైన్యాధికారి లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ హబీబ్ జాహిర్ భారత అధీనంలో ఉన్నారని, అతని గురించిన సమాచారం చెప్పాలని లేఖ రాసింది. జాదవ్ ను విడుదల చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే హబీబ్ ను ఇండియా అరెస్ట్ చేసిందని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించినట్టు పాక్ మీడియా వెల్లడించింది. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు పేర్కొంది.

కాగా, జాదవ్ పేరును ఉటంకిస్తూ, భారత దౌత్యాధికారులతో అధికారికంగా పాక్ ప్రభుత్వం చర్చించడం ఇదే తొలిసారి. కాగా, పాక్ ఆరోపిస్తున్నట్టుగా హబీబ్ గురించిన సమాచారం తమకు తెలియదని భారత్ చెబుతుండగా, అతను రా కస్టడీలో ఉన్నాడని పాక్ ఆరోపిస్తోంది. కాగా, హబీబ్ అదృశ్యంపై నేపాల్ ఎంబసీ అధికారులు స్పందిస్తూ, అతను మాయమైన మాట వాస్తవమేనని, ఆయన ఎక్కడున్నాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాగా, గతంలో ఐఎస్ఐతో కలసి పనిచేసిన హబీబ్, నేపాల్ లోని లుంబినీకి వచ్చి ఖాట్మండు ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. ఓ రహస్య ఐఎస్ఐ మిషన్ కోసం ఆయన నేపాల్ కు వెళ్లినట్టు అనధికార వర్గాల సమాచారం.

More Telugu News